భద్రాచలం, అక్టోబర్ 25 (నవతరం): దుమ్ముగూడెం మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ తలుపులు మంగళవారం ఉదయం 10 గంటలకు సూర్యగ్రహణం సందర్భంగా మూతపడ్డాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, స్వామి వారి ఆరాధన, బాల భోగ నివేదన కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. 9 గంటలకు మధ్యాహ్న ఆరాధన, రాజభవన్ నివేదన నిరాడంబరంగా జరిగాయి. అనంతరం సూర్యగ్రహణం సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. సాయంత్రం గ్రహణం అనంతరం ఏడు గంటల ముప్పై నిమిషములకు ఆలయ తలుపులు తీసి ఆలయం శుభ్రం చేయడం, సంప్రోక్షణ కార్యక్రమం, స్వామివారి సాయంకాల ఆరాధన చేసి అనంతరం తలుపులు మూసి వేయడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులకు రామయ్య దర్శన భాగ్యం కలుగుతుందని ఆలయ అర్చకులు శేషం కిరణ్ కుమార్ చార్యులు, భార్గవ్ ఆచార్యులు, ఆలయ సిబ్బంది తెలియజేశారు.


