
బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీల కారణంగా మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తనుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ మేరకు ఇంగ్లాండ్కు చెందిన అత్యున్నత బ్యాంకు అధికారి వెల్లడించారు. డిప్యూటీ గవర్నర్ సర్ జాన్ కన్లిఫ్ చెప్పిన దాని ప్రకారం అతి త్వరలో క్రిప్టోకరెన్సీ విలువ ఘోరంగా పడిపోతుందని సున్నాకు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికిక కారణమయ్యే ప్రమాదముందన్నారు.
క్రిప్టోకరెన్సీ విలువ పడిపోతే దాని కారణంగా మొదటిగా వ్యక్తిగత పెట్టుబడిదారులు దెబ్బతింటారు. తద్వారా ఆర్థిక స్థిరత్వం పతనమవుతుంది. అయితే ఆర్థిక సంస్థలపై మాత్రం దీని ప్రభావం తక్కువ ఉండొచ్చని కన్లిఫ్ తన నివేదికలో పేర్కొన్నారు.
ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ విలువ 1.7 ట్రిలియన్లు ఉందని అయితే ఇది దారుణంగా పతనమయ్యే అవకాశం ఉందన్నారు. 2008లో పతనమైన సబ్ప్రైమ్ మార్కెట్ కంటే క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ ఎక్కువ ఉంది.
అయితే ఇలాంటి సందర్భాల్లో వచ్చే ఆర్థిక స్థిరత్వ సమస్యలను ఎదుర్కోవడం అంత సులభం కాదని కన్లిఫ్ అన్నారు.
క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేయడం అత్యంత అవసరమని కన్లిఫ్ వెల్లడించారు.
ఎలాంటి అడ్డుఅదుపు లేకుండా ఆర్థిక వ్యవస్థలో ఏ కరెన్సీ అయినా పెరుగుతుందంటే అది ప్రమాదానికి సూచన. ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేయాలి.
ఈ ఏడాదిలో క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ 200 శాతం పెరిగింది.
బిట్కాయిన్ అంటే..
బిట్కాయిన్ అనేది తొలి క్రిప్టోకరెన్సీ పేరు. 2009లో దీన్ని రూపొందించారు. ఈ కరెన్సీ భౌతిక రూపంలో ఉండదు. ప్రతిదీ డిజిటల్గానే జరుగుతుంది. బ్లాక్చైన్ సాంకేతికతపై బిట్కాయిన్ విలువ ఆధారపడి ఉంటుంది. ఇండియాలో బిట్కాయిన్లపై పెట్టుబడులు పెట్టడం చట్టబద్ధమే. బిట్కాయిన్ ట్రేడింగ్పై భారత్లో నిషేధం లేదు. కానీ క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు.

