దుబాయ్లో గుండెపోటుతో కన్నుమూసిన అందాలతార శ్రీదేవి ఆఖరిచూపు కోట్ల మంది అభిమానులకు మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఆమె తుదిశ్వాస విడిచిన 20 గంటల తర్వాత కూడా భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించలేదు. దుబాయ్ రూల్స్ ప్రకారం భౌతికకాయం అప్పగింతకు కనీసం 24 గంటల సమయం పడుతుంది. దుబాయ్లో ఎవరైనా ఆస్పత్రిలో కాకుండా బయట కన్నుమూస్తే శవపరీక్షలన్నీ నిర్వహించాకే భౌతికకాయాన్ని అప్పగిస్తారు.

వైద్యులు అటాప్సీ పరీక్షలు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సంస్థ ఇవ్వాల్సి ఉంది. పరీక్షల తర్వాత శ్రీదేవి భౌతికకాయాన్ని ముహైస్నా ఎంబాల్మింగ్ సెంటర్కు పంపి అక్కడ ఆమె దేహాన్ని భద్రపరిచే ప్రక్రియని పూర్తి చేస్తారు. తర్వాత డెత్ సర్టిఫికెట్ను జారీచేశాకే ప్రైవేట్ జెట్లో ముంబయికి.. అక్కడి నుంచి జుహూలోని ఆమె ఇంటికి చేరుస్తారు. ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టేలా ఉండటంతో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించవచ్చని కపూర్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.

మొదట ఆదివారం మధ్యాహ్నానికి లేదంటే సాయంత్రానికి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంటుందని భావించారు. దీంతో సోమవారం ఉదయం అంత్యక్రియలు జరగొచ్చని అంచనా వేసుకున్నా ఫార్మాలిటీస్తో అందాలతార ఆఖరిచూపు మరికాస్త ఆలస్యమవుతోంది. సోమవారం మధ్యాహ్నానికల్లా శ్రీదేవి భౌతికకాయం భారత్ చేరుకోగానే ప్రముఖులు, అభిమానుల సందర్శన తర్వాత జూహూ శాంతాక్రాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో బస చేశారు. రాత్రి 11గంటలకు శ్రీదేవి బాత్రూంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించేసరికే ప్రాణాలు కోల్పోయారు.

