

స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారావు పెదకూరపాడు,
నవతరం, పెదకూరపాడు: పట్టుదల ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది లేదని విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి తొలిమెట్టు జీవిత గమ్యానికి పునాది అని స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి కొర్లకుంట వెంకట సుబ్బారావు అన్నారు. జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ, 1981 నుండి 1986 వ సంవత్సర పూర్వ విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో పెదకూరపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ ఆవర్లను పురస్కరించుకొని న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీని శనివారం సుబ్బారావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ చేస్తామన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కాకాని వెంకటరమణ మాట్లాడుతూ పట్టుదలతో, ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది లేదన్నారు. జన చైతన్య సమితి కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని అలాంటి విద్యను ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మంచినీళ్ల శ్రీధర్, చెన్నంశెట్టి బాజి, దాసరి విజయ్ బెన్నిబాబు, ఉపాధ్యాయులు కుంభ రాధాకృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

