తన అభినయంతో, అందంతో కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న అందాలతార రాలిపోయింది. దేదీప్యమానంగా వెలిగిన శ్రీదేవి మరణంతో సినీ వినీలాకాశం చిన్నబోయింది. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండా ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. అనారోగ్యం ఉందన్న సంకేతముంటే తనకున్న స్టార్ స్టేటస్కి మంచి ట్రీట్మెంట్ తీసుకుని ఉండేది శ్రీదేవి. మొదటిసారి హార్ట్ ఎటాక్ రావటం, దాంతోనే ఆమె చనిపోవడం అందరికీ కలలా ఉంది.

54 ఏళ్ల శ్రీదేవి తన గ్లామర్ని కాపాడుకునేందుకు చేయించుకున్న సర్జరీలే ప్రాణం తీశాయా అన్న అనుమానం కలుగుతోంది. మైకేల్ జాక్సన్ మరణంతో పోల్చుకుంటున్నారు శ్రీదేవి విషాదాన్ని. శ్రీదేవి బాలీవుడ్లో ప్రవేశించిన కొత్తలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. మైకేల్జాక్ససన్ కూడా కొనదేలిన ముక్కు కోసం ఎన్నో సార్లు సర్జరీ చేయించుకున్నాడు. శ్రీదేవి ఆ తర్వాత కూడా స్లిమ్గా, అందంగా కనిపించేందుకు ఇంప్లాంట్స్, లైపోసక్షన్, బొటాక్స్ వంటి అనేక చికిత్సలు చేయించుకుందని చెబుతున్నారు.
మరణంలో కూడా శ్రీదేవికి, మైకేల్జాక్సన్కి ఎంతో సారూప్యత కనిపిస్తోంది. అందాన్ని కాపాడుకుంటూ, వయసు కనిపించకుండా చూసుకుంటూ సర్జరీలతో పాటు ఆహార అలవాట్లని మార్చేసుకున్నారు ఇద్దరూ. మైకేల్ అయితే స్లిమ్గా ఉండేందుకు అన్నం మానేసి ఎంతోకాలం టాబ్లెట్లతోనే గడిపాడు. శ్రీదేవి మరీ అంతలా కాకున్నా తన సౌందర్యాన్ని కాపాడుకునేందుకు తీసుకున్న మితిమీరిన జాగ్రత్తలు కూడా ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీశాయన్న అనుమానాలొస్తున్నాయి. ఇద్దరూ గుండెపోటుతోనే…అది కూడా రాత్రివేళనే కన్నుమూయడం మరో విషాదం.


