
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంపై ఏదో చర్చ తెరపైకి వస్తూనే ఉంది.
గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు ఇప్పటివరకూ డబ్పులు చెల్లించకపోగా.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రం నిధులు విడుదల చేస్తూనే ఉంది. హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని చెప్పి దొరికిపోయింది. ఇప్పుడు పని దినాల వాడకం విషయంలోనూ జగన్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తున్న కేంద్రం… విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
ఉపాధి హామీ పథకం
దేశవ్యాప్తంగా పేదలు పస్తులుండకూడదన్న సత్సంకల్పంతో గతంలో యూపీఏ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపట్టే పనుల్లో కార్మికులకు కచ్చితంగా ఏడాదిలో నిర్ణీత పని దినాలు ఉపాధి దక్కేలా 2005లో జాతీయ ఉపాధి హామీ చచ్టాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ప్రతీ రాష్ట్రానికి అక్కడి పరిస్ధితుల ఆధారంగా కేంద్రం పని దినాలు కేటాయిస్తూ వస్తోంది. ఏడాదిలో కేటాయించిన వని దినాల్ని అవసరాల్ని బట్టి వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇందులోనూ అక్రమాలు తప్పడం లేదు.
జగన్ సర్కార్ లో ఉపాధి హామీ
ఏపీలోనూ ఉపాధి హామీ పథకం 2005 నుంచి అమలవుతోంది. మధ్యలో ప్రభుత్వాలు మారిన ఈ పథకం విషయంలో మాత్రం ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులకు మాత్రం ఇప్పటివరకూ జగన్ సర్కార్ డబ్బులు చెల్లించడం లేదు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడం, న్యాయస్ధానం ఆదేశాలతో చెల్లింపులు మొదలుపెట్టడం జరుగుతోంది. అయినా ఇంకా పూర్తిస్ధాయిలో వైసీపీ సర్కార్ చెల్లింపులు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అటు కేంద్రం కూడా సీరియస్ అవుతోంది.
ఏపీలో ఉపాధి దినాల వాడకం
ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది డిసెంబర్ వరకూ 20 కోట్ల పనిదినాలకు కేంద్రం అనుమతిచ్చింది. అంటే మొత్తం కూలీలు చేసిన పని దినాలు లెక్కిస్తే 20 కోట్లు రావాలన్నమాట. వీటిని ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ వరకూ వీటిని వాడుకున్న తర్వాత వచ్చే ఆర్ధిక సంవత్సరం లోపు అంటే మిగతా మూడు నెలలకు జరిగే పనులకు కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుంటుంది. ఇప్పుడు ఆ అదనపు నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది అంటే ఇచ్చిన పని దినాలు ఇప్పటికే వాడేసినట్లన్నమాట.
ఉపాధి హామీలో స్కాం జరిగిందా ?
వైసీపీ ప్రభుత్వం కేవలం 5 నెలల కాలంలో తమకు ఏడాదికి కేటాయించిన పని దినాల్ని అసాధారణంగా వాడేసిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమవుతోంది. ఏయే జిల్లాల్లో ఈ పని దినాలు వినియోగించుకున్నారో నివేదికలతో సిద్ధంగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు అందాయి. అలాగే ఒకటి రెండు రోజుల్లో పనులు ఎక్కువగా జరిగినట్లు చూపిస్తున్న విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించి వాస్తవ పరిస్ధితుల్ని తెలుసుకోనున్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ సర్కార్ పై కేంద్రం అనుమానాలు?
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమల్లో రాజస్దాన్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు ఎప్పుడూ ముందుంటాయి. ఆయా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పని దినాల వినియోగం భారీ ఎత్తున ఉంటుంది. దీనికి తగినట్లుగానే కేంద్రం కూడా కేటాయింపులు చేస్తోంది. అలాంటి రాష్ట్రాల్లోనే ఈ ఏడాది కేటాయించిన పని దినాల వినియోగం ఇంకా పూర్తి కాలేదు. అలాంటిది ఏపీలో జగన్ సర్కార్ మాత్రం కేవలం ఐదు నెలల కాలంలో ఏకంగా 20 కోట్ల పని దినాలు వాడుకోవడంపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఉపాధి హామీ పథకం అమల్లో టాప్ రాష్ట్రాలు ఇప్పటివరకూ కేవలం 60 నుంచి 70 శాతం పని దినాల్ని మాత్రమే వాడుకోగా.. ఏపీలో మాత్రం అసాధారణంగా 21 కోట్ల పనిదినాలు వాడేయడం అనుమానాలకు కారణమవుతోంది. దీంతో క్షేత్రస్ధాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర బృందం పర్యటన తర్వాత వాస్తవాలు వెలుగు చూడనున్నాయి. వాటి ఆధారంగా కేంద్రం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

