పోలవరం పనులపై కేంద్రం సంతృప్తి…

0
309

వేగవంతం చేయాలని సూచన…

దిగువ కాఫర్ డ్యామ్ పనులు నిర్వాసితులపునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం…

నవతరం, రాజమండ్రి: గోదావరి నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలోనూ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు నిర్విఘ్నంగా.. శరవేగంగా కొనసాగుతుండటంపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) సంతృప్తి వ్యక్తం చేసింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించింది. నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్, సభ్య కార్యదర్శి ఎంకే శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే, ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్‌), విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.
వరద కాలంలోనూ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను వేగంగా చేస్తుండటంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను నెలాఖరులోగా రక్షిత స్థాయికి పూర్తి చేయాలని సూచించింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నీటిని పూర్తిగా తోడి వేశాక.. ఈసీఆర్‌ఎఫ్‌ పునాది డయా ఫ్రమ్‌ వాల్‌ పటిష్టతను మరోసారి పరిశీలించాలని సూచించింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ) మార్గదర్శకాల మేరకు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నదీ గర్భంలో ఖాళీ ప్రదేశాన్ని వైబ్రో కాంపక్షన్‌ విధానంలో అభివృద్ధి చేసి.. ఈసీఆర్‌ఎఫ్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించింది. ప్రాజెక్ట్‌ సీఈ ఎం.సుధాకర్‌బాబు పనుల పురోగతిని పీపీఏకు వివరించారు. ఏదిఏమైనా సకాలంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి తెలుగు రాష్ట్రాలలో పంట పొలాలకు నీరు అందించగలిగితే జగన్మోహన్ రెడ్డి అపర భగీరథుడుగా పిలవబడుతాడనడంలో సందేహంలేదు.