కాపు మంటల్లో రాజకీయం చలి కాచుకుంటుంటే..సేఫ్ గేమ్ ఆడింది ఏపీ ప్రభుత్వం. ఓ పనైపోతుందని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బంతిని కేంద్రం కోర్టులోకి తోసేసింది. తేల్చాల్సింది కేంద్రమేనని, తమ చేతుల్లో ఏమీ లేదనీ, తాము చేయగలిగిందంతా చేసేశామనేది చంద్రబాబు సర్కారు వాదన. రిజర్వేషన్లకు ఆమోదముద్ర పడ్డా లేకపోయినా కొన్నాళ్లు ఏ గొడవా ఉండదనుకుంటే విషయం మొదటికొచ్చేసింది.
కాపు రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం(డీవోపీటీ) బ్రేకేసింది. దాన్ని ఆమోదించవద్దని కేంద్ర హోంశాఖకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని తేల్చిచెప్పేసింది.దీంతో పోయినేడాది డిసెంబరులో శాసనసభలో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లుకు విలువలేకుండా పోయింది. సంబరాలు చేసుకున్నంత సమయం పట్టలేదు..గోడక్కొట్టిన బంతిలా బిల్లు తిరస్కరించేందుకు.

ఏపీ సర్కారునుంచి గవర్నర్కి…అక్కడినుంచి రాష్ట్రపతి ఆమోదంకోసం కేంద్రానికి చేరింది కాపు రిజర్వేషన్ బిల్లు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత… రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో ఈ అంశాన్ని చేరిస్తేనే న్యాయ వివాదాలు తలెత్తకుండా ప్రక్రియ సాఫీగా సాగుతుంది. కేంద్ర హోంశాఖ దీనిపై డీవోపీటీ అభిప్రాయం కోరింది. ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే డీవోపీటీ కాపు బిల్లు పార్లమెంటుదాకా వెళ్లకుండానే కుదరదని చెప్పేసింది.

1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం… మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అయితే… అసాధారణ పరిస్థితులు నెలకొన్నట్లయితే ఈ నిబంధనలను సడలించవచ్చని సుప్రీంకోర్టు తెలిసింది. అయితే 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు కల్పించాల్సిన అసాధారణ పరిస్థితులేంటో ఏపీ ప్రభుత్వం వివరించలేకపోయింది. కాపు రిజర్వేషన్ల కోసం రాష్ట్రప్రభుత్వం జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్ను నియమించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. విద్యా, ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఈ ప్రక్రియని డీవోపీటీ లెక్కలోకే తీసుకోకుండా ఒక్క ముక్కలో అసాధ్యమని తేల్చేసింది.

