
పత్తాలేని ఏపీ పోలీస్ బాధితులకు ఆపన్నహస్తంలో అట్టర్ ఫ్లాప్…
112 కు బాధితుల ఫిర్యాదులపై పోలీసుల నిర్లక్ష్యం…
కేవలం 5.58 నిమిషాల్లోనే రక్షణ కల్పిస్తూ మొదటిస్థానంలో చండీగఢ్ పోలీసులు
దేశంలో సగటున 18.28 నిమిషాల్లో స్పందిస్తున్న పోలీసులు…
ఏపీలో మాత్రం 25.50 నిమిషాల సమయం తీసుకుంటున్న పోలీసులు…
కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి… సీఎం చంద్రబాబుకు లేఖలో పేర్కొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా… లేఖలో పోలీసింగ్ ఎలా చేయాలో సూచించిన అమిత్షా
నవతరం, విజయవాడ: వైఎస్సార్సీపీ హయాంలో 5 నుంచి 8 నిమిషాల్లోపే ఘటనాస్థలానికి పోలీసులు…
ఇంటిపేరు కస్తూరి వారు.. ఇల్లంతా ‘గబ్బిలాల కంపు’ అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ తీరు.
టెక్నాలజీకి తాను అంబాసిడర్నని, ఐటీ, ఏఐలను
తానే కనిపెట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే
సీఎం చంద్రబాబు బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించే టోల్ ఫ్రీ నంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది.
అగ్రస్థానంలో చండీగఢ్ పోలీసులు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు పోలీసు, అగ్నిమాపక, ఇతర అత్యవసర సేవలను ఏకీకృత వ్యవస్థకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 112ను ప్రవేశపెట్టింది. ఆ నంబరుకు బాధితులు చేస్తున్న కాల్స్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న అంశాన్ని కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. దేశ వ్యాప్తంగా 112కు వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల సగటు స్పందన సమయం 18.28 నిమిషాలుగా ఉంది. అంటే బాధితుల నుంచి ఫోన్ కాల్ రాగానే 18.28 నిముషాల్లోనే పోలీసులు వారికి తగిన సహాయం అందించి రక్షణ కల్పిస్తున్నారు. మీరు వెనుకబడి ఉన్నారు.. ఇప్పటికైనా స్పందించండి పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడంలో సీఎం చంద్రబాబు వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన లేఖలో ఏమాత్రం మొహమాటం లేకుండా ఎత్తిచూపారు. బాధితులకు తక్షణం సహాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్ 2.0) ను ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఈఆర్ఎస్ఎస్ 2.0 ఆపరేషన్ ప్రొసీజర్ను 21 రాష్ట్రాలు మాత్రమే ప్రవేశపెట్టాయని అమిత్ షా పేర్కొన్నారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏపీలో ఇప్పటివరకు ‘ఈఆర్ఎస్ఎస్ 2.ఓ’ ను ప్రవేశపెట్టనే లేదన్నది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

