




రికార్డు స్థాయిలో ఆదాయం రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ కమీషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు..




నవతరం, ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో రూ. 2.17 కోట్ల ఆదాయం లభించింది. గత 35 రోజుల కాలానికి గాను ఈ మొత్తం లభించింది. ఇందులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా రూ. 1,58,00,536/- నగదు, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.59,82,822ల నగదు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలుగా 42 గ్రాముల 400మిల్లీ గ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి, అలాగే 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలలో లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తలు సి హెచ్ రాంబాబు, సలాది నాగేశ్వరరావు, పి. భవాని, సి హెచ్.సత్యనారాయణ, ఎస్ సూర్య కుటుంబరావు, ఎమ్ త్రిమూర్తులు హాజరయ్యారు. పర్యవేక్షణాధికారులుగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం అసిస్టెంటు కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి (ఎఫ్ ఏ7 సీ) డి సురేశ్ బాబు, పలివెల గ్రూపు 2 దేవాలయాల ఈవో పి వి వి ఎస్ కామేశ్వరరావు, ఆత్రేయపురం గ్రూపు 3 దేవాలయాల ఈవో బి నరేంద్ర కుమార్ వ్యవహరించారు. హుండీ ఆదాయం లెక్కింపుకు కరూర్ వైశ్య బ్యాంక్, రావులపాలెం, కెనరా బ్యాంక్, రావులపాలెం వారు సహకారం అందించారు. అలాగే అర్చకస్వాములు, వేదపండితులు, గ్రామస్థులు, శ్రీవారి సేవకులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు మాట్లాడుతూ ఈ సారి రికార్డు స్థాయిలో రూ2.17 కోట్ల ఆదాయం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు మాట్లాడుతూ భక్తుల సహాయ, సహకారాలతో ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

