
కోవిడ్ వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
నవతరం, తాడేపల్లి: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, నివారణపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పరిస్థితులకు ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగంలోని ఆస్పత్రులుకూడా దీనికి సిద్ధంగా ఉండాలనని ఆదేశించారు. వ్యాక్సినేషన్ మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలన్నారు. 13 జిల్లాల్లో 98.96శాతం మొదటి డోస్, 71.76శాతం రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూరరైందని.. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్ వేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్ డోస్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్ డోస్ అవసరమని ప్రాథమిక అంచనావేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
ఇక కరోనా పాజిటివ్ కేసులు ఒమిక్రాన్ వ్యాప్తిపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఒమిక్రాన్ కేసులున్నాయని తెలిపిన అధికారులు.., వీరిలో ఎవ్వరూ కూడా ఆస్పత్రిపాలు కాలేదన్నారు. అదికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ప్రస్తుతానికి భయాందోళనల అవసరం లేదని.. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్ సర్వే తప్పనిసరిగా జరగాలని సీఎం స్పష్టం చేశారు. కొవిడ్ నివారణలో టెస్ట్ ఎర్లీ, ట్రేస్ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్ధతులలో పోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలని.., సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలన్నారు. విదేశాలనుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారిని ట్రేస్ చేయాలన్న సీఎం.., ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలు చేయాలన్నారు. విదేశీ ప్రయాణికులకు పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్కు కూడా వెంటనే టెస్టులు చేయాలన్నారు.
రాష్ట్రంలో కొత్త మెడికల్కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. ఇవి పూర్తయితే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మెడికల్సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యంకూడా అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఒకవైపు నాడు-నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
బదిలీలకు పచ్చ జెండా.
వైద్య ఆరోగ్యశాఖలో జనరల్ బదిలీలకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని.., ఆలోగా కొత్త రిక్రూట్మెంట్లను కూడా పూర్తిచేయాలి: అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

