
నవతరం: ఇప్పటికే మహమ్మారి బారిన పడిన వారిలో కూడా కోవిడ్ యాంటీబాడీలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ పొందిన వ్యక్తుల్లో.. కరోనావైరస్ బారిన పడకుండా ఫస్ట్ డోస్ తీసుకున్న వారితో పోలిస్తే అధిక స్థాయిలో రోగనిరోధక శక్తి ఉంటుందని తాజా పరిశోధన వెల్లడించింది. నేచురల్ ఇన్ఫెక్షన్, ఒక డోసు టీకాతో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఏర్పడుతుందని పరిశోధకులు గుర్తించారు. వీరిలో వృద్ధి చెందే యాంటీబాడీలు శరీరంలో ఎక్కువ కాలం ఉంటాయని కనుగొన్నారు. కేరళకు చెందిన క్లినికల్ ఇమ్యునాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్ డాక్టర్ పద్మనాభ షెనోయ్, అతడి బృందం కేర్ హాస్పిటల్స్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
కోవిడ్ నుంచి కోలుకున్న, టీకాలు తీసుకున్న ఆటో ఇమ్యూన్ రుమాటిక్ వ్యాధుల బాధితులు సుమారు 1,500 మందిపై ఈ పరిశోధన చేశారు. వీరందరి రోగనిరోధక ప్రతిస్పందనను అంచనా వేశారు. వీరిలో 120 మంది రోగులను హైబ్రిడ్ రోగనిరోధక శక్తిని అధ్యయనం చేయడానికి ఎంపిక చేశారు. వీరందరిలో యాంటీ-స్పైక్ యాంటీబాడీలను కొలిచారు. దీంతో పాటు వైరల్ న్యూట్రలైజేషన్ ఎనాలిసిస్ ద్వారా వైరస్ను న్యూట్రలైజ్ చేసే సామర్థాన్ని గుర్తించారు.
ఇన్ఫెక్షన్ సోకి, కోలుకున్న తర్వాత ఒక డోసు కోవిషీల్డ్ పొందిన రోగుల్లో యాంటీబాడీలు.. వ్యాధి సోకకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారు, లేదా గతంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వారితో పోలిస్తే.. హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉన్న వారి యాంటీబాడీలు వైరస్ను సమర్థంగా నిర్వీర్యం చేస్తాయట. వైరల్ న్యూట్రలైజేషన్ విశ్లేషణలో ఈ విషయం తేలిందని చెబుతున్నారు డాక్టర్ షెనోయ్. ఇన్ఫెక్షన్ తరువాత అభివృద్ధి చెందిన రోగనిరోధక శక్తి కంటే, హైబ్రిడ్ రోగనిరోధక శక్తి గొప్పదని అధ్యయనంలో కనుగొన్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఒక డోసు వ్యాక్సిన్ సరిపోతుందని చెబుతున్నారు డాక్టర్ షెనోయ్. యాంటీబాడీలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వారికి రెండు డోసులు అవసరం కాకపోవచ్చని తెలిపారు. దీనివల్ల దాదాపు 3 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఆదా చేయవచ్చని విశ్లేషించారు. ఇంతకు ముందు కూడా కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలపై ఇలాంటి అధ్యయనాలు జరిగాయి. హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్స్ కోవిషీల్డ్పై ఒక అధ్యయనం నిర్వహించింది. ICMR కోవాగ్జిన్పై చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత, వారికి ఒకే డోసు వ్యాక్సిన్ సరిపోతుందని ఈ రెండు అధ్యయనాల్లోనూ తేలింది.

