
కొంత మంది మాదిరిగా డబ్బు కోసం దిగజారను…
ఓ పత్రిక, ఛానల్ లో వచ్చిన కధనాలపై మండిపడ్డ భట్టి..
నవతరం, హైదరాబాద్: సింగరేణి బొగ్గుగని టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఓ చానల్లో ప్రసారమైన, పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనం తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉందని మండిపడ్డారు. ఇవాళ ప్రజాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిగజారుడు రాజకీయాల కోసం అబద్దపు వార్తలు అల్లే సంస్కృతి తనది కాదని, తన క్యారెక్టర్ అంత వీక్ కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తాను ఆస్తులు, వ్యాపారాల కోసం రాలేదని, తెలంగాణ వనరులను ప్రజలకు దక్కేలా చూడటమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. మీడియా సంస్థల ఆరోపణలపై తక్షణమే స్పందించిన ఆయన, పారదర్శకత కోసం సదరు టెండర్లను రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఆంద్రజ్యోతి రాధాకృష్ణకు కట్టుకథలు అల్లడం, ఎవ్వరో మెప్పుకోసము వ్యక్తిత్వ హననాని పాల్పడం అయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. త్వరలో మీడియా ముందు అన్నీ బయటపెడతా.. జర్నలిస్టుల అరెస్టులు, సిట్ ఏర్పాటు వంటి అంశాలను ముడిపెడుతూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. టెండర్ నిబంధనలు బోర్డు నిర్ణయిస్తుందని, ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. తనపై ఇలాంటి కథనాలు రాసిన సదరు పత్రిక, చానల్ యజమాని త్వరలోనే పూర్తి వివరాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని, వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల క్యారెక్టర్లపై కట్టుకథలు ప్రసారం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన భట్టి. ఈ వ్యవహారంపై త్వరలోనే పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి త్వరలో అన్ని విషయాలను బయటపెడతానని తేల్చి చెప్పారు.

